ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి….
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు ఆదేశాలు….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
ప్రజల నుంచి అందుతున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన పడాల పద్మ తన రెండవ కుమార్తెకు కళ్యాణ లక్ష్మి దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ నెంబర్ తీసుకోవడం లేదని సమస్యను వివరించగా, సంబంధిత మీ సేవ, రెవెన్యూ అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
శ్రీరాంపూర్ మండలం భీమారం పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల రమ్య తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, అర్హతలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పీడీ హౌసింగ్ అధికారికి కలెక్టర్ సూచించారు.
ముత్తారం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ తమ భూమికి సంబంధించిన సర్వే నెంబర్లో కాల్వ లేకున్నా ఉన్నట్లు చూపిస్తూ 47 గుంటల భూమిని తొలగించారని ఫిర్యాదు చేయగా, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ డీ విభాగం అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

