ఇంధన కొరతపై సోషల్ మీడియా తప్పుడు ప్రచారం
** బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
** తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే అవసరానికి మించి ఇంధనం తీసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దీనిపై
సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నగరంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై స్పందించారు.
ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తిరుపతి పరిధిలో ఉన్న 189 పెట్రోల్ బంకుల్లో కేవలం 26 బంకులు మాత్రమే తాత్కాలికంగా డ్రై అవుట్ అయ్యాయని, వాటికి కూడా సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఇంధనం సరఫరా చేయబడుతుందని తెలిపారు. ఈ సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయని వెల్లడించారు. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ డిమాండ్ ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయని, ప్రజలు తమ అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం వినియోగించాలని సూచించారు. జిల్లా ఎస్పీ హెచ్చరిస్తూ, సోషల్ మీడియాలో ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.

