లేబర్ కోడ్స్ రద్దుకై పోరాటం ఉధృతం చేయాలి, 140వ. మే డే పిలుపు….
అర్జీ–2 డివిజన్లో మే డే పోస్టర్ ఆవిష్కరణ… కార్మిక హక్కుల కోసం ఐఎఫ్టీయూ పిలుపు…
సాక్షిత పెద్దపల్లి/ పెద్దపల్లి జిల్లాలోని అర్జీ–2 డివిజన్ పరిధిలో వివిధ హౌస్కీపింగ్, సివిక్ విభాగాల్లో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మే డే పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. అశోక్ పాల్గొని మాట్లాడుతూ, పారిశ్రామిక విప్లవం తర్వాత కార్మిక వర్గం హక్కుల కోసం సాగించిన పోరాటాల ఫలితంగానే నేటి హక్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేపట్టిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేశారు.
కార్మికుల త్యాగాలతో మే డేకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని, ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ ఏడాది “లేబర్ కోడ్స్ రద్దుకై పోరాటాన్ని ఉధృతం చేయండి” అనే నినాదంతో 140వ మే డేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు జే. నిర్మల, డి. లక్ష్మి, బండ పద్మ, వి. రాజనర్సు, స్వరూప, ప్రేమ్ కుమార్, మల్లయ్య, జె. మల్లేష్, గుండు పద్మ, కావ్య, కవిత, రాజమ్మ, బుజ్జమ్మ, కుమారి, నర్సింగం, నవీన్, వీరస్వామి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

