టేకుమట్లలో గంజాయి బ్యాచ్ హల్చల్.. గ్రామస్థుల్లో భయాందోళన

Sakshitha news

టేకుమట్లలో గంజాయి బ్యాచ్ హల్చల్.. గ్రామస్థుల్లో భయాందోళన

గంజాయి మత్తులో దాడులు – కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో గంజాయి వాడకం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గ్రామంలో గంజాయి మత్తులో తిరుగుతున్న యువకుల దాడులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి టేకుమట్ల ఖమ్మం రహదారి పక్కన ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు యువకులు గంజాయి మత్తులోకి వెళ్లి దుకాణ యజమానులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారు అంతటితో ఆగకుండా సూర్యాపేట నుంచి తమ స్నేహితులను పిలిపించి గ్రామంలో గందరగోళం సృష్టించారు.

దుకాణంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి భయానక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గ్రామాల్లో గంజాయి బ్యాచ్ హల్చల్ పెరుగుతుండటంతో అమాయక ప్రజలు భయంతో జీవిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Scroll to Top