భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లో మనాలి రాజ్ ఠాకూర్ పర్యటన…
ప్రజల సమస్యలు తెలుసుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గోదావరిఖని పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ బుధవారం సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా దుర్గానగర్, ఎన్టీపీసీ శాలపల్లి, న్యూ పోరట్పల్లి సహా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన కాలనీల్లో నీటి నిల్వలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి, నిల్వ నీటిని వెంటనే తొలగించడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు లేదా ప్రజాప్రతినిధులను వెంటనే సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ పర్యటనలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణశ్రీ, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
