ఆర్‌జీ-3, ఏపీఏ క్రీడా సమన్వయకర్తగా బూర్ల సదానందం.

Sakshitha news

ఆర్‌జీ-3, ఏపీఏ క్రీడా సమన్వయకర్తగా బూర్ల సదానందం….

30 ఏళ్ల క్రీడా అనుభవానికి కీలక బాధ్యత.. నేటి నుంచే సింగరేణి వార్షిక క్రీడలు….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ సింగరేణి ఆర్‌జీ-3, అడ్రియాల ప్రాజెక్టు (ఏపీఏ) ఏరియాల 2026-27 వార్షిక క్రీడల నిర్వహణ కోసం క్రీడా కమిటీని ఆర్‌జీ-3 ఏరియా జీఎం ఎస్. మధుసూదన్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఓసీపీ-2లో ఈపీ ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న బూర్ల సదానందంను క్రీడా సమన్వయకర్తగా నియమించారు.

సదానందం గత 30 సంవత్సరాలుగా హాకీ క్రీడాకారుడిగా సింగరేణి సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బొగ్గు సంస్థలు నిర్వహించిన కోల్ ఇండియా క్రీడా పోటీల్లో పాల్గొని సింగరేణికి ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు సింగరేణి జట్టు పతకాలు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

తన క్రీడా ప్రతిభకు గుర్తింపుగా ‘ఎమర్జింగ్ ప్లేయర్’, ‘బెస్ట్ ప్లేయర్’ అవార్డులతో పాటు ‘నల్లవజ్రం’ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. క్రీడా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదానందంను క్రీడా సమన్వయకర్తగా నియమించడంపై ఆర్‌జీ-3, ఏపీఏ ఏరియాల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

అలాగే కే.ఎల్.ఎన్. ప్రసాద్, వీర్ల సంపత్, గంధం శ్రీనివాస్, హఫీజుద్దీన్, వి.వి. గౌడ్, సారయ్య, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, డి. శ్రీనివాస్, నారాయణ, చంద్రశేఖర్ రెడ్డిలకు వివిధ క్రీడల నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. వారి నియామకాలను క్రీడాకారులు స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఆర్‌జీ-3, ఏపీఏ ఏరియాల 2026-27 వార్షిక క్రీడలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.