నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో దారుణ హత్య కలకలం

Sakshitha news

నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో దారుణ హత్య కలకలం

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో రాత్రి 12:00 గంటల సమయంలో జరిగిన ఘోర ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే భయంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగినట్లు సమాచారం. స్థానికులు తెలియుచేసిన వివరాల ప్రకారం……


సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్ఎస్ కార్యకర్తలను ముప్పేటగా దాడి చేసిన ఘటనలో గ్రామం ఉలిక్కిపడింది. ఈ దాడిలో బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్‌తో పాటు మరో 15 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితిపై వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని ఘర్షణలు చోటు చేసుకోకుండా గ్రామంలో పహారా కట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Scroll to Top