ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద ప్రమాదాలకు చెక్…

Sakshitha news

ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద ప్రమాదాలకు చెక్…

హెచ్చరిక బోర్డుతో జైపూర్ పోలీసుల అప్రమత్త చర్య….

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంచిర్యాల జోన్‌లోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి వాహనదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ భూమేష్ మాట్లాడుతూ, ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయడం, టిఫిన్ బండ్లు మరియు ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

రహదారిపై టిఫిన్ బండ్లు లేదా ఇతర వ్యాపారాలు నిర్వహించకుండా సహకరించాలని, వాహనదారులు రహదారిపై వాహనాలను నిలిపివేయకుండా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ప్రజల ప్రాణ భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్‌ఐ భూమేష్, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.