పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యం… రెయిన్కోట్లు పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వర్షాకాలంలో విధి నిర్వహణకు ఉపయోగపడే రెయిన్కోట్లను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిబ్బందికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు విధులు నిర్వహించే సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో రెయిన్కోట్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
పోలీస్ శాఖలో సిబ్బంది సంక్షేమం, భద్రత కోసం అవసరమైన సౌకర్యాలను అందించేందుకు కమిషనరేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శేఖర్, మల్లేశం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
