నాలుగు సంవత్సరాల తరువాత పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాల

Sakshitha news

నాలుగు సంవత్సరాల తరువాత పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాల

సాక్షిత వనపర్తి, :
వనపర్తి జిల్లా
పానగల్ మండలం నిజామాబాద్ గ్రామంలో నాలుగు సంవత్సరాలుగా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాల బుధవారం తిరిగి పునఃప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిజామాబాద్ గ్రామస్థుల ఆనందోత్సాహాల మధ్య పాఠశాలలో విద్యా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారు. విద్యార్థులు పుస్తకాలు, కలం పట్టుకుని తరగతి గదుల్లోకి అడుగుపెట్టడంతో పాఠశాల ప్రాంగణం మళ్లీ సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి రవి పాల్గొని మాట్లాడుతూ మూతపడ్డ స్కూల్ తిరిగి పునః ప్రారంభం కావడంతో చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో పాఠశాల అభివృద్ధి పనులు కోసం సహాయ సహకారం అందిస్తానని స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వ పాఠశాలను సౌకర్యవంతంగా తీర్చిదిద్ది గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరాఠి లక్ష్మి, ఉప సర్పంచ్, వరలక్ష్మి, పానగల్ ఎంఈఓ, ఆనంద్ కేతపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు అనంత రామ్ రెడ్డి వార్డు మెంబర్లు, బాలస్వామి జె,రామకృష్ణ, సరోజ, కిట్టు, మాజీ సర్పంచ్, ఆంజనేయులు, మాజీ వార్డ్ మెంబర్ మద్దిలేటి, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Scroll to Top