అక్రమ చేపల చెరువులపై కలెక్టర్ ఉక్కుపాదం…
22 అక్రమ చెరువుల కూల్చివేత.. 80 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కూల్చివేతల ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 22 అక్రమ చేపల చెరువులను తొలగించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో ముర్మూర్ గ్రామంలో 17, సోమన్పల్లి గ్రామంలో 2, పొట్యాల గ్రామంలో 2, ఎల్లంపల్లి గ్రామంలో 1 చొప్పున అక్రమ చెరువులను గుర్తించి తొలగించినట్లు తెలిపారు.
ఈ చర్య ద్వారా గత ఆరు సంవత్సరాలుగా ఆక్రమణకు గురైన సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ కూల్చివేత ప్రక్రియలో నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొన్నారని తెలిపారు.
ప్రభుత్వ భూములను అనుమతి లేకుండా ఆక్రమిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు.
