ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మహాధర్నాను విజయవంతం చేయాలి…
తెలంగాణ ఉద్యమకారులందరూ ఇందిరాపార్క్కు తరలిరావాలి….
–తోడేటి శంకర్ గౌడ్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి జిల్లా,
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖని పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారుల ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి నిజమైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో వికలాంగులైన కుటుంబాలు, జైలుకు వెళ్లిన ఉద్యమకారులు, ఎఫ్ఐఆర్ నంబర్లు ఉన్న ఉద్యమకారులు, బైండోవర్ అయిన వారు, పేపర్ కటింగ్స్, వంటావార్పు, రాస్తారోకో వంటి ఉద్యమాల్లో పాల్గొన్న ఆధారాలు ఉన్న ప్రతి ఉద్యమకారుడు పెద్ద ఎత్తున హాజరై ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు మరువలేనివని, ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ తెలంగాణ సాధన కోసం పోరాడిన వారిని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమకారుల త్యాగాలు, అమరవీరుల కుటుంబాల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల స్థలం, రూ.25 వేల పెన్షన్, రైల్వే పాస్, బస్ పాస్, రూ.20 లక్షల వరకు హెల్త్ కార్డు, కుటుంబాలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఉద్యమకారుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
కేశవరావు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, రామగుండం నియోజకవర్గ ఇంచార్జి నూతి తిరుపతి, మహిళ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల కళావతి, గంగారపు శాంతలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ వర్ష స్వాతి, మహిళా ప్రధాన కార్యదర్శి సిల్క్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి పిల్లి రమేష్, సీనియర్ ఉద్యమ నాయకుడు వల్లాల మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా విరలాల్, ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు తోట సురేష్, శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
