ధాన్యం దించుకునే ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలి

Sakshitha news

ధాన్యం దించుకునే ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలి: వనపర్తి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి. వినోద్ కుమార్

సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా నుండి కేటాయించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి. వినోద్ కుమార్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ జోగులాంబ గద్వాల జిల్లాలోని జగదంబ, జోగులాంబ, శ్రీ వేంకటేశ్వర మరియు శ్రీ బాలాజీ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వనపర్తి జిల్లాకు సంబంధించిన ధాన్యం ఈ మిల్లులకు కేటాయించిన నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న అన్‌లోడింగ్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో వేగంగా దించుకోవాలని స్పష్టం చేశారు. మిల్లుల వద్ద లారీల నిలిపివేతను తగ్గించేందుకు గాను హమాలీల (కార్మికుల) సంఖ్యను తక్షణమే పెంచుకోవాలని మిల్లర్లకు చెప్పారు. మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను ఎప్పటికప్పుడు అన్‌లోడ్ చేస్తూ రోజువారీ దిగుమతి సామర్థ్యాన్ని పెంచాలని, ఎక్కడా లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చూడాలని అధికారులను, మిల్లర్లను ఆదేశించారు.

ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు మరియు రైస్ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Scroll to Top