తెలంగాణ అమరవీరుల త్యాగాలే రాష్ట్ర ప్రగతికి పునాది….
మంచిర్యాలలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి….
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం…
– ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి:మంచిర్యాల, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక విద్యార్థులు, యువత, ప్రజల త్యాగాలు, ఉద్యమ స్పూర్తి ఉన్నాయని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అందజేస్తున్న మోటారు వాహనాల (స్కూటీల) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
