తెలంగాణ యువత భవిష్యత్తుపై బీజేపీ, బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు….
రాజకీయాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం…
–ఎంపీ వంశీ కృష్ణ…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
తెలంగాణ యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ వంశీ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీ కేంద్రాలు పనిచేస్తుండగా, మరో 65 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతోందని తెలిపారు.
ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులు, యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో శిక్షణ పొంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
అయితే ప్రతిపక్ష నాయకులు యువతను అభివృద్ధి దిశగా ప్రోత్సహించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు.
తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతను ఉద్యోగ, ఉపాధి అవకాశాల వైపు నడిపించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
