డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి…
జూన్ 3న అర్జీవన్ జీఎం కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి…
ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను పిలుపు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,సింగరేణిలో డిపెండెంట్లకు ఉద్యోగాల నియామక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు అర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించబడిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 400 మందికి పైగా డిపెండెంట్లు ఇప్పటికీ ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. వారికి ఇంతవరకు నియామక ఉత్తర్వులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నిరుద్యోగం కారణంగా ఆయా కుటుంబాలు గత రెండేళ్లుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఉద్యోగాల కోసం డిపెండెంట్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డిపెండెంట్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని గుర్తింపు సంఘం ఏఐటియుసి సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి యాజమాన్యానికి వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అందువల్ల డిపెండెంట్లు, కార్మికులు, ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో జూన్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు అర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని రంగు శ్రీను పిలుపునిచ్చారు.
