వన మహోత్సవంలో భాగంగా 2026 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో 20,60,900 మొక్కలు

Sakshitha news

వన మహోత్సవంలో భాగంగా 2026 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో 20,60,900 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా యంత్రాంగం

సాక్షిత వనపర్తి :
వచ్చే వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటి జిల్లాలో అటవీ శాతం పెంచాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో 2026 సంవత్సరపు వన మహోత్సవ కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం వనపర్తి జిల్లాలో 20,60,900 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. వన మహోత్సవం లక్షం సాధించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వారికి ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.


లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు నర్సరీ లలో ఎత్తైన మొక్కలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జూన్ మాసంలో రెండు వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభించి మాసం చివరి వరకు పూర్తి చేయాలన్నారు. త్వరగా మొక్కలు నాటే ప్రక్రియ పూర్తిచేస్తే సంవత్సరం మొత్తం పడే వర్షాల వల్ల బాగా ఎదుగుదల ఉంటుందని చెప్పారు. ఎవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పండ్ల మొక్కలు, ఈత, మునగ వంటి మొక్కలు అధికంగా నాటాలని సూచించారు. నాటిన మొక్కలకు జియో టాగింగ్ చేయాలని ఆదేశించారు.
2027 సంవత్సరానికి అవసరమైన మొక్కలు ఇప్పటి నుంచే నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పిడి డి ఆర్ డి ఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top