వ్యవసాయ భూములకు ఉచితంగా చెరువు మట్టి…
రేపటి నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ….
చెరువు మట్టిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి ,
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు లేని చెరువుల నుంచి సారవంతమైన చెరువు మట్టిని వ్యవసాయ భూములకు తరలించుకునేందుకు రైతులకు ఉచితంగా అనుమతులు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇందుకు ఆసక్తి గల రైతులు రేపటి నుంచి సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, చెరువు మట్టిని కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేశారు. దరఖాస్తులో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పీపీబీ వివరాలు, రవాణా వాహనం వివరాలు, వాహన నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.
సంబంధిత తహసీల్దార్లు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు జారీ చేస్తారని, అనంతరం రైతులు చెరువుల నుంచి చెరువు మట్టిని తమ వ్యవసాయ భూములకు తరలించుకోవచ్చని వివరించారు.
రైతులకు ఈ సారవంతమైన చెరువు మట్టిని పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. చెరువు మట్టిని ఇతర అవసరాలకు మళ్లించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధించి, కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

