పెద్దపల్లిలో ఉమ్మడి కరీంనగర్ చెస్ ఎంపిక పోటీలు, రాష్ట్ర స్థాయికి ప్రతిభావంతుల ఎంపిక…”
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 22న బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా చదరంగ సమాఖ్య అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్, కార్యదర్శి బజ్జూర్ ప్రసాద్ తెలిపారు. అండర్-7, అండర్-11 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అండర్-7 విభాగంలో పాల్గొనదలచిన క్రీడాకారులు 2019 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. అండర్-11 విభాగంలో పాల్గొనే వారు 2015 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు.
ఈ పోటీలు బుధవారం ఉదయం 9 గంటలకు పెద్దపల్లిలోని అమర్ చంద్ కళ్యాణ మండపం, రిక్రియేషన్ క్లబ్లో జరుగుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు సమయానికి హాజరై తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
అండర్-7, అండర్-11 విభాగాల్లో తలా నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలను ఎంపిక చేసి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారై ఉండాలని స్పష్టం చేశారు.
క్రీడాకారులు చెస్ బోర్డులు, పావులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు నిర్వాహకులను సంప్రదించాలని తెలిపారు.

