పునర్జన్మనిస్తున్న సీ.పీ.ఆర్
** విద్యార్థులు సీ.పీ.ఆర్ నేర్చుకోవడం తప్పనిసరి
** అవగాహన సదస్సులో స్విమ్స్ డైరెక్టర్ పిలుపు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపధ్యంలో ప్రాణాలను కాపాడటంలో సి.పి.ఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటీషన్) కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులు సి.పి.ఆర్ పై అవగాహన పెంచుకొని ఎదుటివారి ప్రాణాలను రక్షించాలని స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్.వి.కుమార్ కోరారు.
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడిసిన్ విభాగం – భారతీయ విద్యా భవన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం భారతీయ విద్యా భవన్ స్కూల్లో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ
గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రమాదబారిన పడుతున్నారని పేర్కొన్నారు. స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్. అల్లాడి మోహన్ మాట్లాడుతూ… విద్యార్థులు ఇలాంటి నైపుణ్యాలను పెంచుకుని బాధ్యత గల పౌరులుగా సమాజానికి ఉపయోగపడాలన్నారు.
గుండెనొప్పి ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదని, ఒకవేళ గుండెనొప్పితో భాదపడుతున్న వారికి అవయవాలన్ని పనిచేయడం ఆగిపోవడానికి ఐదు నుంచి 10 నిమిషాలు సమయం పడుతుందని, ఆ ఐదు నిమిషాల సమయమే అత్యంత విలువైన సమయమని ఈ సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయ విద్యా భవన్ అధ్యాపకులను అభినందించారు. స్విమ్స్ మెడిసిన్ విభాగం ప్రొఫెనర్ డాక్టర్. హరికృష్ణ మాట్లాడుతూ… ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె స్తంభించి, హృదయ స్పందనలు ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు. కొందరికి గుండెల్లో నొప్పి రాకుండానే ఈ రకమైన గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని, ఆ సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని, విద్యార్ధులకు సిపిఆర్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, ఎంఆర్ఓ శిరీష, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్. అలోక సుమంత రే, మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్. సునీల్, డాక్టర్.శ్రీకాంత్, డాక్టర్. వినోద్, డాక్టర్. వెంకటేష్, డాక్టర్. శ్రీ లాస్య, డాక్టర్. సునీత, డాక్టర్. దేవిక, భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ రాజు ప్రిన్సిపాల్ పద్మజ, మదర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY