లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి…
ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి….
ఉచిత శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి- పెద్దపల్లి/ : జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల కోసం పెద్దపల్లి జిల్లా అభ్యర్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కరీంనగర్లోని రేకుర్తి సమీపంలోని కిమ్స్ పీజీ కళాశాలలో పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న యువశక్తి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా మాట్లాడి శిక్షణ విధానం, బోధన, వసతి, భోజనం తదితర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో ప్రతి రోజును విలువైనదిగా భావించి ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు.
“శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదవాలి. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి” అని కలెక్టర్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను సమర్థవంతంగా అందించాలని సంబంధిత అధికారులు, శిక్షణ నిర్వాహకులను ఆదేశించారు. వసతి, భోజనం, బోధన తదితర అంశాల్లో నాణ్యత పాటిస్తూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం కరీంనగర్లోని శౌర్య డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నారు.
జూలై 27, 2026న ప్రారంభమైన ఈ శిక్షణ 100 రోజుల పాటు కొనసాగనుంది. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులను సమర్థవంతంగా సన్నద్ధం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం 100 మంది బాలికలు, 150 మంది బాలురు కలిపి మొత్తం 250 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికై జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ అభ్యర్థులను ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పి. ప్రవీణ్కుమార్ రెడ్డి, ఎక్స్ సర్వీస్మెన్ ఎల్. మహిపాల్ రెడ్డి, శౌర్య డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు, కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST