మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా – మాజీ మంత్రి వెలంపల్లి
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం నాడు విడుదల చేసినప్పుడు ఓ పత్రిక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలే ధ్యేయంగా అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు.బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని లేని కేసులను సృష్టించి వైయస్సార్సీపీ నాయకులను వేధించడం అత్యంత అన్యాయమని,గతంలో కారుమూరి కుమారుడు సునీల్ను,ఇప్పుడు కారుమూరిని అక్రమంగా అరెస్ట్ చేయడం కూటమి అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరిగాయని,బెల్టు షాపులు,పర్మిట్ రూమ్లను రద్దు చేసి మద్యం వ్యవస్థను ప్రక్షాళన చేశామని గుర్తుచేశారు.కానీ, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడే బార్ల ప్రివిలేజ్ ఫీజుల రద్దు, సిండికేట్లు,బెల్టు షాపులతో ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగించారని ఆరోపించారు.తమ హయాంలో జరిగిన అక్రమాల కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను,మాజీ మంత్రులను జైలుకు పంపి లేని కేసులతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.ప్రభుత్వం తక్షణమే ఈ కక్ష సాధింపు చర్యలను స్వస్తి పలకాలని,లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
