వాహనాలకు చట్టబద్ధ పత్రాలు తప్పనిసరి
జాతీయ రహదారిపై రూరల్ పోలీసుల తనిఖీలు – రోడ్డు భద్రతపై అవగాహన
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో #అరైవ్_అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా జనగామ క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై విస్తృత వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రూరల్ ఎస్సై బాలు నాయక్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు తప్పనిసరిగా వెంట కలిగి ఉండాలని సూచించారు.
డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు సక్రమంగా ఉండాలని తెలిపారు. పత్రాలు లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ముందస్తు జాగ్రత్తలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. తప్పుడు మార్గంలో వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం కఠినంగా నిషేధమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, చిన్నారులకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
