కోదాడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం..
చైర్పర్సన్గా ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్గా దేవరపల్లి మల్లీశ్వరి
సాక్షిత : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యవేక్షణలో ఏకగ్రీవ ఎన్నిక
కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల పర్వం సోమవారం లాంఛనంగా ముగిసింది. అంచనాల ప్రకారమే కోదాడ పురపాలక పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హైదరాబాద్ శిబిరం నుంచి కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్వయంగా బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. 35 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవికి ఎర్నేని కుసుమ పేరును కందుల కోటేశ్వరరావు ప్రతిపాదించగా, షఫీ బలపరిచారు. వైస్ చైర్మన్ పదవికి దేవరపల్లి మల్లీశ్వరి పేరును కొల్లా కోటిరెడ్డి ప్రతిపాదించగా, షాబుద్దీన్ బలపరిచారు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవిలు ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేయించారు.
పట్టణ అభివృద్ధికి పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల నాయకత్వంలో కోదాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం అని నూతన చైర్పర్సన్ ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికల అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసుకొని బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY