కేస్లాపూర్ నాగోబాను దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గిరిజన సంస్కృతికి ప్రతీక నాగోబా జాతర
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆదిలాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబాను దర్శించుకున్నారు.ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పీఓ యువరాజ్ మర్మట్, ఆలయ పూజారులు, మెస్రం వంశీయులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.అనంతరం నాగోబా దేవతకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, వారి విశిష్ట సంస్కృతికి నాగోబా జాతర ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతర రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాల విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రిని శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
