ఖాళీ స్థలాల్లో నిర్మాణ వ్యర్థాలు వేయద్దు
** మున్సిపల్ కమిషనర్ మౌర్య సూచన
………
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్నారావు కూడలి, కె.టి.రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు, ప్రజల నుంచి “డయల్ యువర్ కమిషనర్”కు వచ్చిన వినతులను హెల్త్, ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల భవనాల వ్యర్థాలు ఉండడం, మురుగునీటి కాలువల్లో చెత్త ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వెంటనే వాటిని తూకివాకం ప్లాంట్ కు తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. అనుసంధాన మార్గాల్లోని రోడ్లలో కూడా గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలు ఎప్పటి కప్పుడు తొలగించా లన్నారు. ఎవరైనా రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.లు మధు, వెంకట ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
