జైపూర్ పోలీస్ స్టేషన్‌లో మంచిర్యాల డీసీపీ వార్షిక తనిఖీ….

Sakshitha news

జైపూర్ పోలీస్ స్టేషన్‌లో మంచిర్యాల డీసీపీ వార్షిక తనిఖీ….

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి…

—డీసీపీ ఎగ్గడి భాస్కర్…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, జైపూర్/ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌ జైపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను తనిఖీ చేసి దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని డీసీపీ సూచించారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలన, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను చైతన్యపరచాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అన్నారు.

అనంతరం పోలీసు అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో డీసీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top