ఆగస్టు 10 నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తి, పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,పెద్దపల్లి/
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పీఎం కుసుమ్ పథకం కింద నిర్మించిన 1 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఆగస్టు 10 నాటికి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆయన సోలార్ ప్లాంట్ను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక ప్రక్రియలను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిర్ణీత గడువులోనే ప్లాంట్ను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంలో సోలార్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న ఆయన.. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూనే మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ రాముడు, పీఏసీఎస్ చైర్మన్ రాంచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కోలేటి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
