సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్‌పై స్పష్టత ఇవ్వాలి: లంబాడి విద్యార్థి సేన

Sakshitha news

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్‌పై స్పష్టత ఇవ్వాలి: లంబాడి విద్యార్థి సేన

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

తెలంగాణలో కీలక భౌగోళిక, వాణిజ్య, విద్యా కేంద్రంగా ఉన్న సూర్యాపేట జిల్లాను భవిష్యత్ రైల్వే, బుల్లెట్ ట్రైన్ ప్రణాళికల్లో పరిగణనలోకి తీసుకోవాలని లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు శివ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి అనేది కొద్ది ప్రాంతాలకే పరిమితం కాకుండా అందరికీ సమానంగా చేరాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, సూర్యాపేటకు ఇప్పటికీ ప్రత్యక్ష రైల్వే సౌకర్యం లేకపోవడం బాధాకరమని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు మారినా, రైల్వే లైన్ విషయంలో ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని అన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటని, ప్రతిరోజూ వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్, ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ అవసరం మరింత పెరిగిందని పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ప్రధాన ద్వారంగా సూర్యాపేటకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్, విద్యాసంస్థలు, వైద్య సేవలు, వ్యాపార కేంద్రాలు వంటి అంశాల దృష్ట్యా ఈ జిల్లాను భవిష్యత్ రైల్వే ప్రణాళికల్లో విస్మరించకూడదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ మార్గాల ఎంపిక సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ అధ్యయనాల ఆధారంగా జరుగుతుందని తమకు తెలుసని, అయితే ప్రజల అవసరాలు, ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్ పట్టణాభివృద్ధి, ప్రాంతీయ సమానత్వం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
తమకు ఏ ప్రాంత అభివృద్ధిపైనా అభ్యంతరం లేదని, కానీ సూర్యాపేట వంటి కీలక జిల్లాకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని మాత్రమే కోరుతున్నామని శివ నాయక్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైల్వే శాఖ కలిసి సూర్యాపేట ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

Scroll to Top