త్రిమూర్తుల కళ్యాణం పోస్టర్లు ఆవిష్కరణ
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: లోకక్షేమం, ప్రపంచ శాంతి సాధనార్థం మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంగా త్రిమూర్తుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్నట్లు ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ తెలిపారు. ఈ పవిత్ర మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికలను తిరుపతిలోని నేరేళ్లమ్మ ఆలయంలో సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, వెదురుకుప్పం మండలం, కమ్మ కండ్రిగ గ్రామ సమీపంలో స్వయంభుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ద్వారా లోకకళ్యాణం, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పాలని సంకల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు నిరంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్రిమూర్తుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పుణ్య సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దైవ అనుగ్రహం పొందాలని పూజ్య స్వామీజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త చాణక్య ప్రసాద్, రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజ, సభ్యులు సురేష్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి,పురోహితుడు సురేష్ స్వామి, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, విజయభాస్కర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, కొట్టే సుబ్రహ్మణ్యం, మిట్టపల్లి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
