అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో మూడు రోజుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 ట్రాక్టర్ల పై కేసులు నమోదు 9 వాహనాలు సీజ్……… జిల్లా ఎస్పీ వెల్లడి
సాక్షిత వనపర్తి : వనపర్తి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకం, రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అణిచివేస్తామని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, హెచ్చరించారు అక్రమ ఇసుక రవాణా పై ఎస్పీ స్పందిస్తూ జిల్లాలోని వీపనగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ తూముకుంట వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో, జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, వనపర్తి సీఐ, సుగంధ రత్నం, వీపనగండ్ల ఎస్సై, రాణి, పోలీసులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 9 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ,* తెలిపారు. గత మూడు రోజుల వ్యవధిలోనే జిల్లాలో 30 కేసులు నమోదు ఒక వీపనగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక 15 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ తవ్వకం లేదా రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తిస్తే ట్రాక్టర్లు, వాహనాలను తక్షణమే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇసుక అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై తీవ్ర పరిణామాలు తప్పవని అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, ఎవరు చట్టాన్ని అతిక్రమించినా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ప్రకృతి సంపదలను అక్రమంగా దోచుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్ర భంగం కలుగుతుందని, భవిష్యత్ తరాలకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అందువల్ల ప్రజలు చట్టాలను గౌరవిస్తూ ఇసుక అక్రమ తవ్వకం, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకం లేదా రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY