టీటీడీ ఆధ్వర్యంలో “వరల్డ్ ఉమెన్స్ డే”
** ఏర్పాట్లపై జేఈవో శరత్ సమీక్ష
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల మీటింగ్ హాల్లో జెఈఓ( విద్య, ఆరోగ్యం) డా.ఏ శరత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం టిటిడి మహిళా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ, స్పీకర్స్ కమిటీ, పర్చేజ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, ఫుడ్ కమిటీల విధులు, బాధ్యతలను తెలియజేశారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఉపన్యాసకులుగా ఆహ్వానించాలని సూచించారు. టిటిడి మహిళా ఉద్యోగులకు అందించే పద్మావతి అవార్డులు ఈ ఏడాది మరిన్ని పెంచాలని, ఇందుకోసం నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అర్హులైన అన్ని తరగతుల ఉద్యోగులను ఎంపిక చేయాలని అన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి వేద ఆశీర్వచనంతో మహిళా దినోత్సవాన్ని ప్రారంభించాలని, శ్రీ పద్మావతి వైభవం నృత్య కార్యక్రమంతో ముగించాలని చెప్పారు.
ఈ సమీక్షలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో ఆనంద రాజు, టీటీడీ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు కట్టమంచి ఇందిర, అధికారులు, మహిళా ఉద్యోగుల సంఘం నాయకులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY