మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
ప్రపంచస్థాయి ప్రమాణాలతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దాలి
విద్యాశాఖపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశం
సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి
ఉండవల్లి: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను మంత్రి పరిశీలించారు. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి నిపుణులు రూపొందించిన వీడియోను వీక్షించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా నిలవాలి. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా సెంట్రల్ లైబ్రరీ ఉండాలి. ఆర్కైవ్స్, ఆడిటోరియం వసతులతో పాటు 15 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలి. జ్ఞానకేంద్రంగానే కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడాలి. అన్నివర్గాల ప్రజలు సెంట్రల్ లైబ్రరీతో అనుసంధానం కావాలి. ఇందుకు సంబంధించి మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలు, అభ్యసన సామర్థ్యాల పెంపుపై చర్చ
ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలుతీరు, క్లిక్కర్ వీడియోలు, పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చించారు. విద్యార్థుల హాజరు, మార్కులు వంటివి తెలుసుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన లీప్ (LEAP) యాప్ ను ఎంత మంది తల్లిదండ్రులు డౌన్ లోడ్ చేసుకున్నారో మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ టూటర్ వినియోగం, నిడమర్రు పాఠశాల అభివృద్ధి పనులతో పాటు పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం, డీఎస్సీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY