ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు…..
సమతా గ్రంథాలయంలో నివాళులర్పించిన నిర్వాహకురాలు దుర్గం ప్రమీల….
సాక్షిత పెద్దపల్లి // ఎన్టీపీసీ:
మహా యోధుడు, ప్రజాహిత పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని సమతా గ్రంథాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు దుర్గం ప్రమీల గ్రంథాలయ పాఠకులతో కలిసి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహానేత అని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమం, మహిళల రక్షణకు ఆయన పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా సమానత్వ భావనతో రాజ్యపాలన సాగించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను మొదటిసారిగా సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రారంభించారని, ఆయన రాయ్గఢ్లో శివాజీ సమాధిని గుర్తించి ప్రజల్లో చారిత్రక చైతన్యం కలిగించారని ప్రమీల వివరించారు.
యువతరం శివాజీ మహారాజ్ దేశభక్తి, నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY