వనపర్తి మున్సిపాలిటీ లో కొలువుదీరిన నూతన పాలకవర్గం
వనపర్తి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవి మిడిదొడ్డి, వైస్ ఛైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్
వనపర్తి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన 33 మంది సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన ప్రత్యేక అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం.
సాక్షిత వనపర్తి
ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు అందరికి ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసింది.
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా, సమావేశానికి 22 మంది(20 మంది కాంగ్రెస్+ ఇద్దరు స్వతంత్రులు) సభ్యులు హాజరయ్యారు. కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వనపర్తి పురపాలిక చైర్ పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి మాధవి మిడి దొడ్డి పేరును 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు. మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మాధవి మిడిదొడ్డి ను చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్ రెడ్డి, ఎన్నికల అధికారులు, మున్సిపల్ అధికారులు, ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY