సుస్థిర ఆర్థిక వృద్ధికి చేయూతగా ఆర్టీఐహెచ్
- వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు కృషి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపమైన ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేసేందుకు రతన్టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్లో ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో మూడు స్టార్టప్లు, రెండు ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. సింటాక్స్ లెన్స్, ఈటీ ఆర్గానిక్స్ తదితర సంస్థల ఉత్పత్తులను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించి.. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సహాయసహకారాలను పూర్తిస్థాయిలో అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఓ చిన్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు, ఆపై విజయవంతమైన పరిశ్రమ స్థాపనకు కారణమవుతుందని.. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ స్టార్టప్లకు సరికొత్త ప్రోత్సాహమిస్తోందన్నారు. ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్ స్పోక్ ద్వారా స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటూ యువతను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎనిమిది వేల మందికిపైగా ఔత్సాహికులకు అవగాహన కల్పించామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, అగ్రీటెక్, హెల్త్ టెక్, ఫుడ్ టెక్, ఎడ్యూ టెక్ వంటి ఎమర్జింగ్ సాంకేతికతలను ప్రోత్సహించడమే కాకుండా ఆయా రంగాల్లో సుస్థిర ఉపాధి అవకాశాలను సొంతం చేసుకునేలా కృషిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
కార్యక్రమంలో ఆర్టీఐహెచ్ స్పోక్ బృంద సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY