మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. ప్రమాణ స్వీకారం!
దివంగత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్ర పవార్
మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం
ఎన్సీపీ శాసనసభాపక్ష భేటీలో లాంఛనంగా ఎన్నిక
రాష్ట్రానికి తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర రికార్డు
ఎన్సీపీ నిర్ణయానికి మద్దతు ప్రకటించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ను నియమించేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రంగం సిద్ధం చేసింది. ఆమె కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఈ నియామకంతో సునేత్ర పవార్ మహారాష్ట్రకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు.
ఈ నియామకాన్ని లాంఛనంగా ఖరారు చేసేందుకు నేటి మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని విధాన భవన్లో ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సునేత్రను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత, సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ ఆమెతో ప్రమాణం చేయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (66) ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో నాయకత్వ కొనసాగింపు, పాలనలో స్థిరత్వం కోసం ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్సీపీ నిర్ణయానికి తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. “ఈ కష్టకాలంలో పవార్ కుటుంబానికి, ఎన్సీపీకి బీజేపీ అండగా నిలుస్తుంది” అని ఆయన తెలిపారు. ఈ బాధ్యతను సునేత్ర పవార్కు అప్పగించాలని పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారని, అది సమంజసమైన డిమాండేనని ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్ అన్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయి. అజిత్ పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖను తాత్కాలికంగా సీఎం ఫడ్నవీస్ పర్యవేక్షిస్తారని, సునేత్రకు ఎక్సైజ్, క్రీడల శాఖలు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
