సజావుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రంలో పరిశీలన
రాజన్న సిరిసిల్ల,
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు.
ముందుగా నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్, అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కులం ధృవీకరణ పత్రాల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల తహసీల్దార్ కు ఆదేశించారు.
ఈ నెల 30 వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి 05.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల వరకు రెండు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. సిరిసిల్లలో 39 వార్డులకు సంబంధించి.. 13 మంది ఆర్ఓలు, 13 మంది ఏఆర్ఓలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నియమించామని తెలిపారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీం లను నియమించామని విచారించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నూతన బ్యాంకు ఖాతా, అఫిడవిట్, బలపరిచే వారి వివరాలు, మిగతా పత్రాలు సమర్పించాలని సూచించారు. జనరల్ అభ్యర్థులకు ఎన్నికల డిపాజిట్ రూ. 2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ. 1250 ఉందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వెల్లడించారు.
కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY