ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్లో ఉద్రిక్తత
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
యూసఫ్గూడ పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారని ఆరోపణ
పోలీసులను తోసేసి అనుచరులతో కేంద్రంలోకి చొరబాటు
అక్రమ ప్రవేశం, న్యూసెన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి, పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జరిగిన పోలింగ్ సమయంలో యూసఫ్గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన గందరగోళం సృష్టించారని, ఈ ఘటనపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అధికారులు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న పోలింగ్ జరుగుతుండగా కౌశిక్రెడ్డి తన అనుచరులతో కలిసి యూసఫ్గూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం లోనికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆయన వినిపించుకోకుండా సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లారని వారు పేర్కొన్నారు.
కౌశిక్రెడ్డి తీరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆయనపై అక్రమంగా చొరబడటం (ట్రెస్పాస్), పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు మధురానగర్ పోలీసులు వివరించారు. నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, కొన్నిచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
