విద్యాశాఖ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి….
ఇండోర్ స్టేడియానికి అదనపు నిధులు.. స్విమ్మింగ్ పూల్, జిల్లా గ్రంథాలయాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలి….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : విద్యాశాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. ప్రతి పనిని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అలాగే స్విమ్మింగ్ పూల్, జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను అన్ని వసతులతో పూర్తి చేయాలని సూచించారు. కళాశాలకు అవసరమైన అదనపు వసతులు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
కళాశాలను పరిశీలించిన కలెక్టర్
అనంతరం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. కళాశాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ సమీక్షలో టీజీవెదిక్ ఈఈ అశోక్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
