ఫూలే దంపతుల ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం….
విద్య, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…..
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు సామాజిక సమానత్వం, విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.
హైదరాబాద్లో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. శతాబ్దాలుగా కొనసాగిన సామాజిక అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు ధైర్యంగా పోరాడారని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు విద్య అందించడంతో పాటు అణగారిన వర్గాలకు విద్య, గౌరవం, ఆత్మగౌరవం కల్పించేందుకు వారు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఫూలే ఎన్నో అవరోధాలను ఎదుర్కొని పాఠశాలలు నిర్వహించి బాలికల విద్యకు మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. విద్య, సమానత్వం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఫూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం ఒక కార్యక్రమం కాదని, వారి ఆశయాలను సమాజంలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను గుర్తుచేసే సందర్భమని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
