విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి…ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు…
సాక్షిత : సూర్యాపేట జిల్లా/కోదాడ: విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకొని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై నిర్వహించిన శిక్షణ, పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడిక తో మంచి పౌరులుగా తయారుకావాలని అన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రతి ఒక విద్యార్థిలో అసమాన ప్రతిభ దాగి ఉంటుందని వాటిని సమయానుసారంగా ప్రదర్శించినపుడే విజయం వరిస్తుందని అన్నారు. విద్యార్థులకు ఎన్ ఆర్ ఎస్ విద్యాసంస్థలు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకొని విజేతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ విద్యా సంస్థలలో చేరిన ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో నిష్ణాతులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారతీ విద్యాసంస్థల కరస్పాండెంట్ కట్టా సత్తిరెడ్డి, ఎన్ ఆర్ ఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ ( జీ వీ), వైస్ ప్రిన్సిపల్ పీ ఎన్ ఆర్, పీ ఆర్ వో మల్లికార్జున రావు, పలువురు టీచర్లు, కాలేజ్ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
