35వ.డివిజన్కు అభివృద్ధి జోష్….
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. రూ.50 లక్షలతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం….
—మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/
35వ. డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ, రాజ్యలక్ష్మి కాలనీలలో దశలవారీగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రాజ్యలక్ష్మి కాలనీలో రూ.7 కోట్ల ప్రత్యేక నిధుల ప్యాకేజీలో భాగంగా రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికైన వెంటనే ఇచ్చిన హామీ మేరకు రాజ్యలక్ష్మి, సప్తగిరి కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురికాకుండా వరద నీటి కాలువ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామని తెలిపారు.
కొత్తగా ఏర్పడిన కాలనీలు కావడంతో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణం పూర్తయిందని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజ్యలక్ష్మి కాలనీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఇటీవల డివిజన్లో వార్డు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించామని మేయర్ పేర్కొన్నారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాసరావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
