విద్యార్థుల భద్రతే లక్ష్యం.. షీ టీమ్ అవగాహనతో చైతన్యం…..
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి షీ టీమ్ సభ్యులు ఎన్టీపీసీ పీటీఎస్లోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ, విద్యార్థులు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. చిన్నారుల రక్షణ కోసం అమల్లో ఉన్న పోక్సో (POCSO) చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థులు పాటించాల్సిన క్రమశిక్షణ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై వివరంగా అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు డయల్ చేయాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మహిళలు, విద్యార్థినులు ప్రయాణ సమయంలో భద్రత కోసం టీ-సేఫ్ (T-Safe) యాప్ వినియోగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
