జయశంకర్ ఆశయ సాధనే నిజమైన నివాళి.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి…
— బీఆర్ఎస్ నాయకులు…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/
తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డు రవీందర్ పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు రామగుండంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లి, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నారాయణదాసు మారుతి, నీరటి శ్రీనివాసు, దొమ్మేటి వాసు, కొలుగూరి సాయి, కోడి రామకృష్ణ, కిరణ్ జీ, పాలడుగుల కనకరాజు, ప్రేమ్ కుమార్, కొమురయ్య హరికృష్ణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
