వైద్య పరీక్షల పేరుతో కార్మికులను వేధించడం తగదు….
ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను బహిష్కరించాలని ఉమ్మడి కార్మిక సంఘాల పిలుపు…
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, రామగుండం |
వైద్య పరీక్షల పేరుతో ఒప్పంద కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరును నిలిపివేయాలని ఉమ్మడి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంస్థ రెండో ప్రధాన ద్వారం వద్ద ఉమ్మడి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, కార్మికుల ఉద్యోగ భద్రతకు భంగం కలిగే విధంగా వైద్య పరీక్షలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అన్యాయమని అన్నారు. కార్మికుల హక్కులకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను యాజమాన్యం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ఈరోజు నుంచి ఒప్పంద కార్మికులందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతతోనే కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి కార్మిక సంఘాల నాయకులు నామసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, చిలుక శంకర్, దగ్గుల సత్యం, ఇజ్జిగిరి భూమయ్య, రాధారపు రాజమల్లయ్య, అలేటి శ్రీనివాస్, చింతల సత్యం, పురుషోత్తం తదితరులు ప్రసంగించారు. సుమారు 1,500 మంది కార్మికులు సమావేశంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY