తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో కీలక సంప్రదింపులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ….
సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు, పెద్దపల్లి అభివృద్ధి అంశాలపై వినతి…
సాక్షిత – న్యూఢిల్లీ |
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు, కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఢిల్లీలో కీలక స్థాయిలో చర్చలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణకు అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, జల వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ, అటవీ అనుమతులకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, కేంద్ర నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సహకారం అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర ప్రతినిధి బృందం కోరింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY