వంగపల్లి వేదికగా రూ.358 కోట్ల విలువైన హ్యామ్ (HAM) పథకం బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన – భారీ ర్యాలీ, ఘన స్వాగతం, విజయవంతమైన బహిరంగ సభ.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్సీ నేలికంటి సత్యం , ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంగపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద సుమారు రూ.358 కోట్ల నిధులతో హ్యామ్ (HAM) పథకం కింద చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముందు రాయగిరి నుండి వంగపల్లి గ్రామం వరకు దాదాపు వెయ్యి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలు పాల్గొనడంతో మొత్తం మార్గం కాంగ్రెస్ పార్టీ జెండాలతో, నినాదాలతో మారుమోగింది. ప్రజలు రహదారుల వెంట నిలబడి నాయకులకు ఘన స్వాగతం పలికారు.
ర్యాలీ అనంతరం వంగపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, పూల వర్షం మధ్య నాయకులను సభా వేదిక వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు, అధికారులు, మహిళలు, యువకులు, రైతులు, వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
