రామతీర్థం బీచ్లో ఘనంగా యోగాంధ్ర–2026
సాక్షిత : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో
ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో భాగంగా రామతీర్థం బీచ్ సమీపంలో సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక సహకారం, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా యోగాసనాలు వేసి, యోగా సాధన ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ‘యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయి. శరీరాన్ని, మనస్సును సమన్వయం చేసే అద్భుత ప్రక్రియ యోగ. ప్రజల దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేయడమే ఈ ‘యోగాంధ్ర’ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. కోవూరు నియోజకవర్గంలో ఇలాంటి మంచి కార్యక్రమం జరగడానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారం అభినందనీయం.’ అన్నారు. అలాగే జూన్ 21న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కూడా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
కళకళలాడిన రామతీర్థం తీరంఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దిశానిర్దేశంలో స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయడంతో రామతీర్థం ప్రాంతం యోగా సాధకులు, ప్రజలతో కళకళలాడింది. ఈ సామూహిక యోగాంధ్ర కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది ఉత్సాహంగా పాల్గొని పలు యోగాసనాలను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ అధికారులు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆవుల వాసు, స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
