నగరంలో పారిశుద్ధ్యం , నీటి సరఫరా , వీధి దీపాల సమస్యలను పరిష్కరించడానికి రూ 3.36 కోట్ల నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి….
-రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి// నగరంలో పారిశుద్ధ్యం , నీటి సరఫరా , వీధి దీపాల సమస్యలను పరిష్కరించడానికి రూ 3.36 కోట్ల నిధులు అత్యవసరంగా మంజూరు చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి జిల్లా కలెక్టర్ ని కోరారు.
పెద్దపల్లి లోని ఒక ఫంక్షన్ హాల్ లో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై జిల్లాల లోని మునిసిపాలిటీల ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన ఓరియెంటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవికాలంలో నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా బోర్ బావుల మరమ్మత్తులు , కొత్త బోర్ బావులు తవ్వడం , లీకేజీలు మరమ్మత్తులు ,విలీన గ్రామాలతో పాటు సరఫరా లేని ప్రాంతాలకు పైప్ లైన్లు వేయడంలాంటి పనులకు ఒక కోటి రూపాయలు , వీధి దీపాల విడి భాగాల కోనుగోలు , కొత్త వీధి దీపాల , కూడళ్లలో మినీ హై మాస్ట్ లైట్లు ఏర్పాటుకు ఒక కోటి ముప్పది ఆరు లక్షల రూపాయలు , పారిశుద్ధ్య వాహనాల మరమ్మత్తులు , బ్లీచింగ్ , సున్నం తదితరాలకు మరో కోటి రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా వేశామని అన్నారు.
నగర పాలక సంస్థ ఖజానా లో నిధుల కొరత దృష్ట్యా సి ఎస్ ఆర్ , డి ఎం ఎఫ్ టి లేదా ఇతర అందుబాటులో ఉన్న నిధుల నుండి అత్యవసరంగా రూ 3.36 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించారు.
సమావేశానికి రామగుండం నుండి శాసన సభ్యులు ఎం ఎస్, రాజ్ ఠాకూర్ తో పాటు , డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , కార్పొరేటర్లు , నగర పాలక సంస్థ అధికారులు హాజరయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
